ప్రదీపుడి క్షుద్భాధ
మగధ రాజ్యానికి ప్రదీపుడు అనే మహారాజు ఉండేవాడు.అతను ప్రజల్ని ఎంతో బాగా చూసుకునేవాడు.రాజ్యానికి వచ్చే వేదాంతులను,కవులను,మేధావులను,పండితులను,సాధువులను బాగా ఆదరించేవాడు. అతను వేదాంతులకు, కవులకు, మేధావులకు, పండితులకు బహుమానంగా పుత్తడి,వజ్రవైడుర్యాలను ఇచ్చేవాడు.అతనికి రాజ్యంలో"ద్వితీయ కర్ణుడు" అనే పేరుండేది.ప్రజలు కూడా ఆయన్ని "ద్వితీయ కర్ణుడు మా మహారాజు"అని చెప్పుకునే వారు.ఆయని కీర్తి దేశ నలుమూలలా వ్యాపించింది.
ఆయన కొంత కాలానికి మరణించాడు.అతని పాపపుణ్యాల లో పుణ్యాలు చాలా ఉండడంతో ప్రదీపుడు స్వర్గానికి వెళ్తున్నాడు. దారిలో ఆయనికి బాగా దాహం,ఆకలి వేసాయి.ఆకలి దప్పులను ఆపుకుంటూ స్వర్గం దారిలో నడుస్తూ ఉండగా అతనికి దారిలో ఒక ఫలవృక్షం, చిన్న కాలువ కనబడ్డాయి.ఆకలి దాహం తీర్చుకుందామని అక్కడికి వెళ్ళాడు.నీళ్ళు త్రాగుదామని నీళ్ళను తన దోసిళ్లతో తీసుకుని త్రాగబోయాడు. ఆశ్చర్యంగా ఆ నీరు "బంగారు ద్రవం"గా మారిపోయింది . ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే జరిగింది.
సరే పండ్లను తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళి పండుకోసి తినబోయాడు .ఆశ్చర్యంగా ఆ ఫలం వజ్రంలా మారిపోయింది.ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుందాం అని ఆకాశవాణిని అడిగాడు. "ఓ దాన ప్రదీపా! నీవు కర్ణుడి లా బంగారం,వజ్రంలే దానధర్మాలు చేశావు కానీ ఒక పేదవాడికి కూడా 'అన్నదానం' చేయలేదు. అలాగే ఓ పేద సాధువు నీ దగ్గరకు ఆకలితో వచ్చినప్పుడు నీవు అన్నదానం చేయకుండా బంగారం ఇచ్చావు. అది మోయలేని ఆ బీద సాధువు అక్కడే కూలాడు. నీవు అతనిని నీ భటులతో గెంటించ్చావు. తరువాత ఆకలితో అలమటించిన ఆ బీద సాధువు మరణించాడు " అని పలికింది."మరి దీనికి పరిష్కారం ఏమిటి ?"అని అడిగాడు. నీవీరోజు బ్రహ్మను పూజించి ఈ ఒక్క దినం మానవరూపం దాల్చి భూమి కెళ్ళిపది మంది ఋషులకు అన్నదానం చేయి ఇక నీ పాపాలు తీరిపోతాయి" అని పలికింది. ఆకాశవాణి చెప్పినట్టు చేసి విముక్తి పొందాడు." కేజీల బంగారం కన్నా, గుప్పెడు అన్నదానం మిన్న" అని తెలుసుకున్నాడు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ రాజుగా జన్మించి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు.
************************
రచన:లిఖిత్ కుమార్ గోదా
(ఈ కథ నేను బాలల బొమ్మరిల్లు (జూలై2017) బాలల మాసపత్రిక లో రచించినది")
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి