పుస్తక సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, నవంబర్ 2020, ఆదివారం

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

  •  కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు



తరి
ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.
తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.
అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.

ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.

ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.

" సహనశీలి మగువ
  సమరభేరి మగువ
  ఇంటి వెలుగు మగువ
  ఇలన కాంతి మగువ"(16)-
అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.
" చలికి వణికి నపుడు
  చెద్దరగును అమ్మ
  అలసిపోయినపుడు
  ఊయలగును అమ్మ"(30)
- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు.
"
  
  మాట చెలిమినిచ్చు
  మాట కలిమినిచ్చు
  మాట సమత నిచ్చు
  మాట మమత నిచ్చు"(67)
 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.

" మాతృ భాష లోని
  మకరందం వీడకు
  పరుల భాష యొక్క
  పంచన చేరకు!"(84)
అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.

నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.

"నొసటి రాత రాయు
అసలు బ్రహ్మ ఓటు
  బతుకు బాగు చేయు
  బల సూత్రం ఓటు!"(102)
- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.

దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-
" మెతుకులిచ్చు వాడు
  చతికెలపడే నేడు
  అతీగతీ లేక
  చితికి చేరెను చూడు!" (113)
అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.

"మనిషి పైన చేసే
 మారణ హేలల దాడి
 మందుగిందు లేని
 కరోనా మాయలేడి"-(119)


ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.

ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.
మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ఫోన్:- 9949618101

22, నవంబర్ 2020, ఆదివారం

స్వర్గీయులు ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




    భిన్న సాహితీ ప్రక్రియలయిన కథ, కవిత్వం, నాటకం, వ్యాసం, విమర్శ, సమీక్ష వంటి అంశాలలో కొందరు సాహితీవేత్తలు ఏదో ఒక ప్రక్రియలో మాత్రమే రచనలు సాగించి లబ్దప్రతిష్టులు అవుతారు. అయితే వీరిలో కొంతమంది మాత్రం దాదాపు అన్ని ప్రక్రియలతో ప్రవేశం కలిగి సాహితీ ప్రియులను అలరించడం ద్వారా విశ్వవిఖ్యాతులవుతారు.
ఈ కోవలోకి వచ్చే వారు అక్కడక్కడా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. వీరిలో అన్ని సాహితీ ప్రక్రియలతోనూ సంబంధం కలిగి రచనలు చేస్తున్న సాహితీవేత్తగా వేంపల్లి రెడ్డి నాగరాజు గారిని పేర్కొనవచ్చు.


గత మూడు దశాబ్దాల కాలంగా పైన పేర్కొన్న అన్ని సాహితీ ప్రక్రియలలో పయనిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులను అలరిస్తున్న రచయితగా నాగరాజు గారిని పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
తన కలాన్ని ఆకారం లో చిన్నదైనా ఒక ఎడారి రోజా చేసుకుని, గుత్తులు గుత్తులుగా సాహిత్యాన్ని పూయించాలనే ఆశ రెడ్డి నాగరాజు గారిది. తన సూక్ష్మ లిఖితాలతో ఎడారి లాంటి ఈ జగతిలో తనొక ప్రత్యేకం కావాలని కొత్త ఒరవడితో, వ్యూహాలతో మినీ కథలు, మినీ కవిత్వాలు వంటి రచనలు చేశారు.

 ప్రత్యేకించి బాల సాహితీవేత్తగా బాలల కోసం రాసే కథలలో గతంలో ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా ఈ రచయిత తనదైన పేరును సొంతం చేసుకున్నారు. "రూపాయికి ఒక కథ" అంటూ దాదాపు లక్ష కాపీలు దాకా అమ్మారు. బాలసాహిత్యంలో ఈ-తరం బాలల కోసం "కొత్తబాట"ను నిర్మించారు. పిల్లల కోసం "బామ్మలు చెప్పని కథలు, బొమ్మలు చెప్పిన కథలు, గోరుముద్దలు, నవతరం బాలల నీతి కథలు"వంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరు రాసిన బాలల కథలను ఆంగ్లంలోకి అనువదించి రెయిన్బో నామంతో ఒక పుస్తకాన్ని వెలువరించారు ప్రముఖ రచయిత్రి బి.ఎస్. పద్మావతి. అలా వారి కలం నుండి జాలువారిన కథాశిల్ప సంపుటి "పాల బుగ్గల -పసిడి మొగ్గలు".

ఈ పుస్తకం నేటితరం పిల్లలకు దొరికిన "అక్షరాల పాలపుంత" అనుకోవచ్చు. ఇందులోకి పిల్లని ఒక్కసారి చేర్చితే వారు నీతులతో దేహాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు.
మొత్తం రెండు చేతులకి ఉన్న వేళ్లను కలిపితే ఇందులోని కథలు సంఖ్య. పుస్తకంలోని కథలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో నడుస్తూ, పాతదానికి కొత్త రూపును చేర్చి, రసగుల్లల్లా కొత్త రుచులు చూపిస్తూ, పంచతంత్రాలను నవతంత్రాలుగా మార్చి నోరూరిస్తాయి.

యుక్తి కథలో మనకు తెలిసిన పంచతంత్ర కథ అయినా "ద్రాక్ష నక్క"ను తీసుకుని అందులో నక్క ద్రాక్షాల కోసం ఎదురు చూసే భాగం వరకు తీసుకుని తరువాత చమత్కార సృజనకు పదును పెట్టారు రచయిత. నక్క ద్రాక్ష పండ్ల కోసం చెట్టుక్రింద ఉండడం, ఒక కాకి చూసి ఏంటి ఎక్కడున్నావ్ అని అడగడం, పైన ఉన్న ద్రాక్ష పళ్లను పట్టుకుని ఊగితే స్వర్గం చూడవచ్చునని, అలా పులి స్వర్గం చూస్తాను స్నానం చేసి ఇప్పుడే వస్తాను అంటే ఇక్కడ కాపలా కాస్తున్నాను అని నక్క అనడం, నేను స్వర్గాన్ని చూస్తానని కాకి చెప్పడం, నక్క తొలుత కాదనడం, బ్రతిమాలగా ఒప్పుకోవడం, కాకి ద్రాక్షపండ్లను పట్టుకుని ఊగడం, అప్పుడు ద్రాక్ష పండ్లు రాలడం, నక్క ఆశ ఆకలి తీరడం, కాకి తిక్క కుదరడంతో కథ నవ్వులతో ముంచెత్తి కంచికి చేరుతుంది.
"శక్తి లేని చోట యుక్తితో ఎలా విజయం సాధించవచ్చు"నని చూపించిన కథ ఇది.

"నిజమైన గెలుపు" కథలో మనకు తెలిసిన కుందేలు తాబేలు కథనే తీసుకొని, అవి రెండు పోటీ పెట్టుకొని కుందేలు విశ్రాంతి తీసుకునే భాగందాకా తీసుకొని, తరువాత తాబేలు,కుందేలును నిద్రలేపి "గెలుపు దిశగా నడువు,విజయం సాధించాక కావాలంటే విశ్రాంతి తీసుకుందువు గాని" అని అనడంతో చదువరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
"పోటీదారులను ప్రోత్సహించడం కూడా గెలుపొందడంతో సమానం" అని నీతిని ఇచ్చే చక్కటి కథ.

ఏడుగురు రాజకుమారుల కథను "చేపల వేట" కథగా తీసుకొని పర్యావరణ హితాన్ని, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు నేర్పించారు రచయిత వేంపల్లి నాగరాజు గారు.

మనకు పంచతంత్రం నుంచి తెలిసిన "ఆవు పులి కథ" (పుణ్యవతి కథ)ను తీసుకొని ముందుచూపు ఎంత గొప్పదో వివరించారు.

ఇలా దశ ఆణిముత్యాలతో ముస్తాబైన ఈ కథా సంపుటి బాలల మదిలోకి చేరవలసిన మంచి పుస్తకం. పిల్లల కోసం కొత్త తరహాలో కథలు రాయడంలో రచయిత రెడ్డి నాగరాజు గారు సఫలీకృతులయ్యారు. బాలసాహిత్యంలో ఇదొక నిత్యనూతన ప్రయోగమని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి పుస్తకాన్ని మన కళ్ళల్లోకి తీసుకొచ్చిన రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అభినందనలు. ఇటువంటి బాలల కథలు పెద్దలే చదివి పిల్లలచేత చదివించి వారిని నవభారతం వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే రచయితల ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
*నివాసం*:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.

ఫోన్:- 9949618101,7658980766


ప్రతులకు:- 
వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,
 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269
మొబైల్:- 7989928459,9985612167.


10, నవంబర్ 2020, మంగళవారం

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"






బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.


కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.


రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.


  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు

బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.

      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.


బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.

ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.


ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.


"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.

తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.


మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.

"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.


ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.

రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.


ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.


నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!

"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.

ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.

 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.
ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.

"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.
"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.
"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.

పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.
"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.

శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.

పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.
"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.

"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.
ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.

తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 

            ✍️  పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

9, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ సాహితీవేత్త గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు"(పుస్తక సమీక్ష-06)

మొలక న్యూస్ లో ప్రచురించిన నా పుస్తక సమీక్ష (09/11/2020)


పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు కవర్ పేజి




ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.


అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.


ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.


బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.


ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.


మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.


"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.


"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.


"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.


ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!

సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.htm





సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.html




📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒

2, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ బాల సాహితీవేత్త గుడిపూడి రాధికా రాణి గారి పుస్తకం బాల కథంబం పై నేను సూర్య దినపత్రికలో రాసిన పుస్తక సమీక్ష (05)

 నైతికాల మకరందం.. రాధికా రాణి గారి బాల కథంబం (పుస్తక సమీక్ష)

బాల కథంబం పుస్తకం కవర్ పేజి



రచయిత్రి:- గుడిపూడి రాధికా రాణి గారు

నా పుస్తక సమీక్ష-5






సూర్య దినపత్రిక అక్షరం డెస్క్

పసిపిల్లలకు ఈ ప్రపంచంలో విలువైనవి, విశిష్టమైనవి, ఇష్టమైన సంపదలు ఏమన్నా ఉన్నాయీ అంటే అవి ఆలోచనా శక్తికి పదునుపెట్టి, మనసులో మంచి చెడుకు వ్యత్యాసం వివరించి, సద్గుణాల సమేతంగా సత్బాట వైపు నడిపించే బాలల కథలే అని కచ్చితంగా చెప్పాలి.

పిల్లల మనసులు ఐస్కాంతల్లాంటివి. వాటికి నైతికాలను నూరిపోసి, మెదడుకు పని చెప్పే కథలు కనిపిస్తే చటుక్కున అతుక్కు పోతాయి. చక్కగా ఇంట్లో అమ్మో, తాతయ్య నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, పాఠశాలలో ఉపాధ్యాయులో తేనెలొలుకు కథలు చెబుతూ ఉంటే అల్లరి బుడుగులు సైతం గప్చుప్ న కూర్చొని వారు చెప్పే కథల్లో విహరిస్తారు. కథల ఒడిలో వాలిపోతారు. కథల్లో వారికి వచ్చే సందేహాలను, బయట అంతుపట్టని విషయాలను కూడా త్వరగా నివృత్తి చేసుకోగలుగుతారు. అలా వారి మనసు, ఆలోచనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఇంధనం.. మేలైన బాలల కథలే కదా!.

అలాంటి మానవీయ, స్ఫూర్తి నీయమైన, ఆలోచనాత్మక, సృజనాత్మక కథలకు నిలయమే గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం బాలల కరదీపిక.
రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారు ప్రముఖ సాహితీవేత్త. బాలల కథలు, పజిల్స్ ,గజల్స్, కవిత్వాలు రాయడంలో, నిత్య నూతనంగా ఆవిర్భవిస్తున్న నూతన కవితా ప్రక్రియల్లో కలం పట్టడంలో వారిది అందెవేసిన చేయి. రాసిన ప్రతి వాక్యం నలుపాకమే అని చెప్పాలి. భాషా క్రీడాకారిణిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు. మేలైన బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం అందించడంలో సిద్ధహస్తులు.

ఈ పుస్తకంలోని కథలు ఒక్కసారి చదివామంటే చాలు. అల్లరి చేసే గడుగ్గాయులు కూడా సద్గుణులు అవుతారు. ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో వేటికి విలువ ఇచ్చి జీవించాలో, వేటికి ఇవ్వకూడదో కూడా ఇట్టే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.
పెద్దలు సైతం ఈ కథల్ని పాయసంలా స్వీకరించి,వారి ముందు జీవితంలో ఎటువంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి మేలైన మహత్తర సందేశం కలిగిన కథలివి.
పదేపదే విసుగు లేకుండా చదివించే కథలు. వీటికి అవార్డులతో తూకం వేస్తే అది పొరపాటే అని చెప్పాలి.
ఈ కరదీపిక లో మనల్ని తొలకరిగా పలకరించే "జేబులో జోరీగ" కథ నుండి "ఇరుకిల్లు" కథ వరకు, అన్ని మనల్ని పుష్పక విమానం లో కూర్చోబెట్టుకుని చక్కగా విహరింప చేస్తాయి."మనిషి కావాలి మనిషి"అన్నట్టు,"మనిషి లక్ష్యం మనీషి" అన్న సూక్తే లక్ష్యంగా ఇవి మనల్ని తీర్చిదిద్దుతాయి. నవ్విస్తాయి, నేర్పిస్తాయి ఈ కథలు.
 "జేబులో జోరీగ"కథలో రాఘవయ్య అనే పిసినారికి ఐదు రూపాయల నాణెం దొరకడం, అది మాట్లాడుతూ, రాఘవయ్యని ముప్పుతిప్పలు పెట్టడం, ఎంత దూరం విసిరేసిన తిరిగి తన జేబులోకి రావడం, చివరి ప్రయత్నంలో బిచ్చమెత్తుకునే ముసలమ్మకు ఐదు రూపాయల నాణెం దానం చేయగా, ఆ నాణెం ఏం మాట్లాడకపోవటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ ముగింపులో,"ఆకలి వేయకపోయినా స్వార్థంతో తను కొనుక్కుందాం అనుకుంటే, వారించి, వాదించి, వేధించిన ఆ డబ్బే, ఆకలి తో బాధపడుతున్న వ్యక్తికి దానం చేయగానే శాంతించింది"అన్న ముగింపుతో గొప్ప అర్థాన్ని ఇచ్చి చాలా సృజనాత్మకంగా రచించారు రచయిత్రి  "చంద్రుడి కోపం, సూర్యుని తాపం" కథలు మనకెందుకు నెలరోజుల్లో నాలుగు సెలవులు (4 ఆదివారాలు), చంద్రుడు ఎందుకు ఒక రోజు సెలవు (అమావాస్య) తీసుకుంటాడో చాలా చక్కగా వర్ణించారు.
అలాగే ఒకప్పుడు చేదుగా చెరుకు, తీపిక కాకర ఉండి ఇప్పుడెందుకు చెరుకు తియ్యగా, కాకర చేదుగా ఉందో , ఒకప్పుడు పాముకి కాళ్లు ఉండి, ఇప్పుడు ఎందుకు పాకుతుందో జానపద కథలు లాగా కల్పితాత్మకంగా సృజించారు రచయిత్రి.

"పంచదార పిల్లి" కథలో, మంచితనానికి, దొంగతనానికి సమాజం స్పందించే తీరు"ఎలా ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించిన కథ అందర్నీ ఆకట్టుకుంటుంది.

"కుదురు లేని కుంకుడు గింజ" కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి."కుదురుగా ఉంటే అందరూ ఇష్టపడతారు" అన్న నేపథ్యంతో కుంకుడు గింజకి , చింతగింజకి మధ్య జరిగిన కథ. మన పరిసరాల్లో నుంచే కథా వస్తువులు తీసుకుని కథలుగా లిఖించడం రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారి సృజనాత్మకతకు అద్దం పడుతుంది.

ఇందులో చెప్పుకోవాల్సిన కథ "కుండ కోరిక "కూడా. ఇది వాట్సాప్ లో రెండురాష్ట్రాలు చుట్టివచ్చిన రైలు లాంటిది. గొప్ప నీతి ఉన్న జీవితానికి సంబంధించిన కథ. కష్టాల కడలిని దాటుకుంటే పొందే సుఖాన్ని, భయపడితే పొందే శోకాన్ని చక్కగా వివరించిన కథ.
"పిసినారి బావ, కోడలు దానగుణం, "పిండి వంటల రహస్యం" కథలు ముందుచూపు నేర్పించే నిండైన బాలల కథలు.
"ఇరుకిల్లు" మధ్య బంధాలు ఎలా కొలువై ఉంటాయో, భవనాల్లో మానవీయ బంధాలు ఎలా దాక్కుంటాయో" వివరించిన వర్తమాన సమాజపు కథ.
ఈ ఇరవై రెండు కథల్లో కథలో భాగంగానే ముగింపులు నీతిని వివరించారు రచయిత్రి.
ఇలా ఎన్నో ఆసక్తికర శీర్షికలతో,నైతికాల కథలతో ముస్తాబైన ఈ బాల కథంబం కరదీపిక పిల్లల పాలిట ఓ గురువు, ఆస్వాదిస్తే మకరందం, పెద్దల పాలిట మార్గ నిర్దేశం, వర్ధమాన రచయితల పాలిట కామధేనువు, దిక్సూచి.ఇలాంటి కథలు మొత్తం పిల్లలు అందరూ చదివి ఆస్వాదించాలని ఆకాంక్షించాలి ప్రతి తల్లిదండ్రులు. రేపటి భావి భారత పౌరులు ఉత్తమంగా తయారు కావాలంటే చిన్నతనం నుండే ఈ "బాల కథంబం" వంటి కథలు చదవాలి. మనిషి నుండి మహర్షిగా జీవించాలి. బాలసాహిత్యంలో ఇటువంటి మనోరంజక కథల పొత్తాన్ని వెలువరించిన రాధికా రాణి గారికి అభినందనలు.

*పుస్తక సమీక్షకుడు*- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
📗📘📙📗📘📙📗📘📙📗📘📙
నవంబర్ 2,2020

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

🌱🌱మాన్యులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారు సెప్టెంబర్ 17న వాట్సాప్ ద్వారా "క.శ.ప (కథా శతక పద్యం) అనే పుస్తకాన్ని సమీక్ష చేయమని చెప్పి పంపారు. పుస్తకం,అందులోని క.శ.ప లు అత్యద్భుతంగా ఉన్నప్పటికీ నాకు తోచిన రీతిలో పుస్తక సమీక్ష చేసాను. అది మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ఈరోజు (06.09.2020)నా ప్రచురితమైంది. ఇది నా 4వ పుస్తక సమీక్ష. 80వ రచనా ప్రచురణ 🌱🌱.

 తెలుగు వారసులకు బహుమతి.. క.శ.ప (కథా శతక పద్యం) (పుస్తక సమీక్ష)


పుస్తక రచయిత:-  బి.వి.ఎన్. స్వామి


పుస్తక సమీక్షకుడు:-  లిఖిత్ కుమార్ గోదా,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.
_________________
తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు, శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది. కథ చెప్పుకోవడానికి కనువిందుగా ఉంటే, నీతిశతక పద్యాలలో మాత్రం నాలుగు పాదాల్లో శతక కవి ఏం చెప్పదలచుకున్నాడో ఇట్టే అర్థమైపోతాయి.
రెండు సాహిత్య ప్రక్రియలు కూడా నైతిక విలువలు నూరుపోస్తూ, చక్కని నడవడిని నేర్పిస్తూ, ఆలోచింపజేసే తత్వాన్ని రేకెత్తిస్తాయి.
పసి మనసుల్లో సద్గుణాలు విరబూయాలనే దృక్పథంతో ఆనాడు కథలు, సామాజిక విలువలు, చైతన్యం, ప్రజా జాగృతి రావాలనే సదుద్దేశంతో ఆనాడు శతక కవులు నీతి శతకాలను రాశారు. వేమన పద్యాలు, సుమతి సూక్తులు ఈనాటికీ ప్రతి తెలుగువారి నాలుకలపై నాట్యం చేస్తూ అందరిని రంజింప చేస్తున్నాయి.

క.శ.ప(కథా శతక పద్యం) పుస్తకం ముఖచిత్రం.


క.శ.ప పుస్తక రచయిత శ్రీ బి.వి.యన్.స్వామి గారు
(మాన్యులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారికి బావ గారు)

🌱🌱 మొలక న్యూస్ ఆన్లైన్ మ్యాగజైన్ సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారు 🌱🌱




ప్రస్తుతం నేటి బాలల్లో కథలు చదివే తత్వం కాస్తోకూస్తో ఉంది. కథల పుస్తకమో, లేదా ఉపాధ్యాయులు చెప్పే చిట్టి చిట్టి కథలుకు మురిసిపోయి గంతులేస్తుంటారు. కానీ మన వారసత్వంగా వచ్చిన అమూల్యమైన నీతి శతక పద్యాలు అంటే కాస్త చేదు భావాన్ని వ్యక్త పరుస్తారు. "ఈ పద్యాన్ని నేనెలా గుర్తుంచుకుంటాను బాబోయ్, ఈ పదాలు నేనెక్కడ పలకగలను బాబోయ్," అంటూ వెనక్కి మళ్ళి పోతున్నారు. నీతి శతక పద్యాలు అంటే కేవలం నీతి సంపదే కాదు, జ్ఞానం పదకోశ భాండాగారం. నాలుగు పాదాల్లో గొప్ప అర్ధాన్నిచ్చే మన నీతి శతక పద్యాలను పక్కన పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనది తెలుగుజాతి. నీతి శతక పద్యాలు మనకు వజ్రవైఢూర్యాలు తో సమానం. ఎంత దాచుకుంటే అంత ఉన్నతుడిని చేస్తాయి.

ఆధునిక పరిజ్ఞానం పెరగడం ద్వారా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటివి పిల్లల చేతుల్లోకి రావడం వలన తెలుగు పిల్లలు పద్యాలను పక్కన పెట్టేస్తున్నారు. రేపు మన శతక పద్యాలు, శతక కవులు, కమ్మని కథలు మరుగున పడిపోకూడదనే సత్సంకల్పంతో రచయిత బి.వి.ఎన్ స్వామి గారు తమ సాహిత్య అనుభవాలుతో ఈ క.శ.ప(కథా శతక పద్యాలు) అనే నిత్యనూతన కథా ప్రక్రియను సృజించారు. మన తెలుగు భాషలో కవిత్వం, కొత్త సోయగాలతో రోజుకొక ప్రక్రియగా రూపుదిద్దుకుంటున్నాయి. కానీ కథా ప్రక్రియ మటుకు "గల్పిక, కార్డు కథలు, మినీ కథలు వంటి" వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ కొత్తగాను, కొత్తదై పరిమళిస్తుంది తెలుగు కథా ప్రక్రియ.

తెలుగు కథా సాహిత్యానికి, నీతి శతక పద్యాలకు నూతన రూపాన్ని సృష్టించాలనే దృక్పథంతో క.శ‌‌.ప ను సృష్టించి ఉంటారని అనుకుంటున్నాను.
క.శ.ప నియమాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ఈ ప్రక్రియలో కథ ఒక కథానాయకుడు (బుంగి )చేత ఇంకో పాత్రతో , అంటే ఒకరకంగా మనతో చెబుతున్నట్లు తలపిస్తుంది. కథల్లో మనము లీనమై, బుంగీతో మాట్లాడుతున్నట్టు, కాస్త తెలంగాణ యాసను జోడిస్తూ రచయిత చిట్టి చిట్టి కథలతో, శతక పద్యాలతో క.శ.పను అల్లారు. పుస్తకం మొత్తాన్ని చూసుకున్నట్లైతే ఇందులో మొత్తం 117 కి.శ.ప లు రాయబడి ఉన్నాయి. వివిధ శతక కవులను పద్యాలను పరిచయం చేస్తూ తెలుగు జాతికి తెలియని శతకకవులును కూడా పరిచయం చేశారు రచయిత.
నియమాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది నియమాలున్నాయి.
1)ముందుగా మనం ఒక కథను అల్లుకుని, తర్వాత దానికి అనుగుణంగా ఉన్న,
2) నాలుగు పాదాలు ఉండి,
3) నాలుగో పాదం మకుటంగా రచించబడిన నీతి శతక పద్యాలను ఎన్నుకోవాలి.
4) ఇతివృత్తం ఏదైనా, ఒక అంశానికి పరిమితం అయి ఉండి, సంభాషణాత్మకంగా, రెండు పాత్రల ద్వారా కథ నడిపించాలి. అందులో మొదటిది కల్పిత పాత్ర, రెండోది స్వయంగా కథకుడే కావాలి.
5)స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేలా ఉండి, 6)పద్యంలోని మూడో పాదం లోని ఏదో ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాలి. ఆ పదం కథలో ఎక్కడైనా ఉపయోగించి ఉండాలి.
7) తెలుగు లోని అన్ని శతక పద్యాలను గ్రహించి ఉండాలి.
8) పద్యం ఏ కాలానికి సంబంధించినదైనా, కథలోని అంశం, భావం కొత్తదనంతో ఉట్టిపడాలి. వాస్తవ కల్పనతో వాసికెక్కాలి.
ఇవి రచయిత కరముల నుండి జాలువారిన నియమాలు.

గడిచిన సాహిత్య తరిని పరిశీలించి చూస్తే కొంతమంది సాహిత్యకారులు కథను అల్లుకుని, దానికి తోడుగా పద్యాన్ని జతచేసి క.శ.ప ను పోలిన కథ- పద్యాలు రాసినప్పటికీ అవి ఒకే శతక కర్తనో, శతక పద్యాలనో ఎన్నుకొని రాసినవి.
వారిలో బొల్లేపల్లి మధుసూదన్ రావు గారు"తాతయ్య చెప్పిన కథలు"అనే 64 బాలల కథలకు తోడుగా 64 వేమన శతక పద్యాలను జోడించి పుస్తక రూపంలోకి వెలువరించారు.
తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి బాల సాహితీవేత్తలు కూడా వేమన శతకంలోని నీతి సుధలను ఎన్నుకుని పురాణ కథలు, కల్పితకథలు అల్లారు. కానీ అవి ఏవి క.శ.ప నియమానుసారం రాసినవి కావు. అంతే కాకుండా 100 కథ-పద్యాలు పూర్తి ఎందులోనూ కాలేదు.

క.శ.ప కేవలం బి.వి.యన్ స్వామి గారి సాహిత్య అనుభవ కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

"సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరా దా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

"

అంటూ సుమతీ కంద పద్యాలు రాసిన శతక కర్త బద్దెన పద్యాన్ని ఎన్నుకొని బుంగితో "సిరి" క.శ.పను నడిపించారు రచయిత,
"వర్షాలు పడక దిగుబడి లేకపోవడంతో అప్పులు పాలైన ఒక రైతు పంటకు ఖర్చయినా పెట్టుబడిని తీర్చడానికి అప్పులు చేసి మరీ దుబాయ్ వెళ్తాడు. అక్కడ ఉదయం నాలుగు గంటలకు మొదలు రాత్రి 12 గంటల వరకు గొడ్డు చాకిరీ చేయించుకుని 12000 వేతనం ఇచ్చేవారని, వాటిలో తన ఖర్చులను సమకూర్చుకుని ఇంటికి 8000 పంపేవాడని తెలియపరిస్తాడు.
దీని వలన ఇంకా అప్పులు పాలవడంతో ఇక తిరిగి ఊరు వచ్చేసి అక్కడ ముప్పావు వంతు ఇక్కడ కృషి చేస్తే తన బాకీలు అన్ని తీరిపోతాయని అనిపించి బొప్పాయి, మామిడి తోటలు రెండు సంవత్సరాలు ఓపిక కృషిచేయగా తన అప్పులన్నీ తీరిపోయాయి"అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
నేటి సమాజంలో రైతులందరూ పడుతున్న క్షోభ ఇదే. కనికరించని వరుణదేవుడు వల్లో, రసాయనాల వల్లో పంట సరిగ్గా దిగుబడి కాక అప్పుల పాలవుతున్న రైతులు బయటి దేశాలకు వలసలు పోతున్నారని రచయిత చక్కగా వివరించారు. పరాయి దేశాలు పోవడం కంటే ఉన్న ఊళ్లోనే గొప్ప సంకల్పంతో కృషి చేస్తే సిరి దానంతట అదే వస్తుందని తెలిపారు.


" 

  పట్టు పట్టరాదు పట్టి విడువరాదు 

 పట్టెనేని బిగియ పట్టవలయు 

పట్టు వినుట కన్నా పడి చచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
"
అంటూ వేమన పద్యం లోని సారాన్ని ఉదాహరణగా తీసుకొని నవ్వు తెప్పించే ఎలుక కథ ఒకటి భలే వివరించారు రచయిత. ఈ పట్టు కథను చదువుతున్నంత వరకు కథలో ఆ రెండో వ్యక్తి ఎవరు? బహుశా దెయ్యమా? అన్నట్టు తలపిస్తుంది మనకు." చివరికి గోడపై కనబడిందది. కర్రతో బలంగా కొట్టిన. చచ్చి పడింది ఎలుక" అని ముగించడం తో ఈ కథలో రెండో పాత్ర ఎలుకదా? అని తెలియడంతో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది ‌. నవ్వులాగవు అసలు ఈ కథ చదువుతున్నంత సేపు.

" ధనము గలుగు చోట ధర్మంబు కనరాదు

 ధర్మం ఉన్న చోట ధనము లేదు 

ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా

లలిత సుగుణ జాల! తెలుగు బాల!

 
"
-జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తమ తెలుగు బాల శతకం లో రాసిన చక్కటి పద్యం ఇది.
ఈ క.శ.ప శీర్షిక "ధనము.. ధర్మము".

"వ్యాపారం కొత్త దారులు తొక్కుతున్నది"బుంగి అన్నడు.
"నిజమే డబ్బే సరుకుగా వడ్డీ వ్యాపారం జరుగుతుంది". ఈ రెండు సంభాషణలు నేటి కాలంలో వడ్డీ వ్యాపారం ఎలా గంతులేస్తుంది తెలుస్తుంది. ఒకప్పుడు షావుకార్లు ప్రజల అవసరాల కోసం డబ్బులు ఇచ్చి తమ కొట్టును నడిపే వారిని. ఇప్పుడు ప్రజల అవసరాలు ని లాభంగా చేసుకుని గోల్మాల్ చేస్తున్నారని అంటాడు బుంగి.
కథలు ఇలా సంభాషణ కూడా జరుగుతుంది-
"ఆనాటి వ్యాపారులకు తాము జనం వల్ల బ్రతుకుతున్నాము అనే స్పృహ ఎక్కువగా ఉండేది. ఈనాటి వాళ్లు మా వల్లనే జనం బ్రతుకుతున్నారు అనే అహం లో ఉన్నారు"అంటూ లేచి వెళ్ళి పోతాడు బుంగి.
అలా లేచి వెళ్లిపోవడంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అసహనం మనకు తీక్షణంగా కనపడుతుంది. ఎందుకంటే బుంగి నిజాయితీ కలిగిన వ్యక్తి.

"మాటలు యీటెల వంటివి
 దాటినచోనవి పెదవి ధాటిగ వచ్చున్
మాటే ప్రాణ నమంబుగా
మాటలు మాట్లాడు మంచి మన్నన మురళీ! "-
అంటూ పబ్బ మురళి తన మురళి శతకంలో నుంచి గ్రహించబడింది.

ఈ కథలో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి వెళ్లి నీకు నచ్చిన రచయిత పేరు చెప్పమంటే తప్పకుండా వస్తాడు. సాహిత్య విద్యార్థి అయ్యుండి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు.
"పుస్తకం చదవడం, పరీక్షరాయడం, మార్కులు కొట్టేయడం ఇదే నాకు తెలుసు"అంటూ సమాధానం ఇస్తాడు.
తర్వాత కాస్త చిరాకు వ్యక్తం చేస్తాడు.
ఈ క.శ.పను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ
పై మాటలు ప్రస్తుత విద్యార్థుల చదువులను తెలియజేస్తున్నాయి. పాఠాలు చదవడం, పరీక్షల్లో వాటికి అనుగుణంగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడమే కానీ అందులో ఉన్న సారాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని నేటి విద్యార్థులు ఎవరు గ్రహించడం లేదని చేదు నిజాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత.
ఇలాంటి కథలు మరెన్నో ఈ ఈ కథ శతక పద్యంలో నిక్షిప్త పరిచి ఉన్నాయి. ఇవి కేవలం పిల్లల కోసం రాసిన ఏమి కాదు. ఒక సామాజిక దృక్పథంతో, సమాజంలో చోటు చేసుకుంటున్న దుర్గతులను తెలియపరచాలని సదుద్దేశంతో రాసిన క.శ.పలు. ఇవి అన్ని తరాల వారికి ఉపయోగకరం. అందరూ ఆచరణీయ కరం.
కథలు చదువుతూ పద్యాలు నేర్చుకోవడం ద్వారా మన తెలుగు భాషను కాపాడుకుని నట్లు అవుతుంది, మన జ్ఞాన భాండాగారాన్ని మరింత మెరుగ్గా, నైతిక విలువలతో కూడా మెలగడమూ తెలుస్తుంది. రచయితలందరం ఈ క.శ.పను అనుసరించి మన తెలుగు వారసులకు గొప్ప బహుమతిని అందిద్దాం. తెలుగు వాణి(శతకపద్యాలు, నీతి శతక పద్యాలు) వినిపించి తెలుగు వారిని తెలుగు వాళ్ళగా మలచి ధన్యులుగా జీవించేలా చేద్దాం. భవిష్యత్తులో తెలుగు భాషా మహోన్నతంగా విలసిల్లాలని ఆశిద్దాం. మరోమారు రచయిత కృషికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం.
______________

పుస్తక సమీక్షలు-4
మొలక న్యూస్
సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి
81వ రచనా ప్రచురణ
06.09.2020

క్రింది లింక్లో పుస్తక సమీక్షను చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/sE_1VO.html
🔥🔥🔥🔥🔥🔥🔥🔥

1, ఆగస్టు 2020, శనివారం

పుస్తక సమీక్ష-3(పసందైన బుజ్జి పాటల హరివిల్లు.. ఉయ్యాల జంపాల)

పుస్తకం:- ఉయ్యాల జంపాల
పుస్తక రచయిత:- గంగదేవు యాదయ్య
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల బోనకల్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507204
చిరునామా:-
హౌస్ నెంబర్:-1-115/3,
బనిగండ్లపాడు గ్రామం ,ఎర్రుపాలెం మండలం ,ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ప్రచురించిన పత్రిక:- మొలక న్యూస్
01-08-2020

పసందైన బుజ్జి పాటల హరివిల్లు... ఉయ్యాల జంపాల
(పుస్తక సమీక్ష)


బుజ్జి పాటలమ్మా.. బుజ్జి పాటలు‌. పసందైన పల్లె పాటలు, పిల్లలు మెచ్చే ఆట"పాటలు", ఆహ్లాదాన్ని కలిగించే అందమైన పాటలు, పిల్లల మనసులను చురగొనే కొంటైన పాటలు, అందరినీ అలరించి, ఆకట్టుకునే అపురూపమైన పాటలు.

పసిపిల్లలు బుజ్జి పాటలకి భలే తొందరగా ఆకర్షితులవుతారు. బుజ్జి పాటలంటే చెవి కోసుకొంటారు. అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ పాడే"చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?","చికుబుకు రైలు వస్తుంది.."వంటి పాటలు నుండి, స్కూల్లో టీచర్ లు చెప్పే రైమ్స్, పద్యాలు , పాటలు వరకూ ఊ ప్రతిదాన్ని చటుక్కున ఆకలింపు చేసుకుని ముద్దు ముద్దు స్వరాలతో, ముచ్చటైన పదాలతో అందంగా పాడుతుంటారు. సృజనకు తొందరగా ఆకర్షితిమయ్యే మనస్తత్వం పిల్లలది.
అలాంటి పసి మనసులు తెలిసిన గంగాదేవు యాదయ్య గారు బాలల్లో తియ్యటి చిరునవ్వుల కోసం వారు పాడుకోదగిన బుజ్జి పాటలు ఎన్నో సృష్టించారు. ఆ పసి మనసు దోచే బుజ్జి పాటలు ఉన్న బంగారు పుస్తకమే ఈ "ఉయ్యాల.. జంపాల".
గత 30 ఏళ్లు బోధనా శాస్త్రం లో నూతన పద్ధతులు రూపకల్పనా, వయస్సును, స్థాయిని, ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలు తయారుచేస్తున్నారు యాదయ్య గారు. లిపిలేని కోయ, గోండి భాషల్లో బాల సాహిత్య సృజన కోసం శ్రీకారం చుట్టి ఆయా భాషల్లో మొదటి తరం రచయితలను వెలికి తీసి తమ కార్యశాల ద్వారా ఉత్సాహపరిచి మెరుగులు దిద్దుతున్నారు.
కోయ భాషలో తెలుగు లిపితో 8 పుస్తకాలు, కొండరెడ్ల మాండలికంలో నాలుగు పుస్తకాలు రావడానికి సూత్రధారి యాదయ్య గారు. కోయ భాషలో బాల సాహిత్య సృజనను ఒక ఉద్యమంలా చేశారు. ఇవాళ అనేకమందికి కోయ పిల్లలు వారి మాతృభాషలో బాలగేయాలు పాడుకుంటున్నారు.
ఈ ఉయ్యాల జంపాల బుజ్జి పాటల పుస్తకం లో పాటలు భలే గమ్మత్తుగా, పిల్లలను అలరిస్తూ, ఆకర్షిస్తూ కొత్త లోకానికి తీసుకుపోతాయి. కొన్ని బుజ్జి పాటలు నిత్యం ఇంటి దగ్గర, పరిసరాల దగ్గర జరిగే విషయాలే చెబుతూ "అరే నిజమే కదా! మనము ఎలా చేసుంటాం కదా అనుకుంటాం కదా"అని అబ్బురపడేలా చేస్తాయి.

హా..హా.. ఆహా.. బుజ్జి పాటను ఒకసారి పరిశీలిద్దాం,
 "అమ్మ నీళ్లు తీస్తుంటే
నేను కూడా తెస్తాను!
అమ్మ వంటలు చేస్తుంటే
ఆశ్చర్యంగా చూస్తాను!
ఘుమ ఘుమ వాసన వస్తుంటే
గుటకలు వేస్తూ ఉంటాను!
వంటలు తయారు అవ్వంగానే
అంతా స్వాహా చేసేస్తాను!
శుభ్రంగా స్వాహా చేసేస్తాను
ఆహా
ఏమి ఆహారం!!
- ఈ బుజ్జి పాటను పాడుతూ ఉన్నంతసేపు అమ్మ చుట్టూ తిరుగుతూ, అమ్మ చేసే వంట తరించి ఎవరు అలా చేయరు?
అలాగే "వాన.. గానం" భలే గమ్మత్తుగా ఉంటుంది..
"పై నుండి వాన
కింద నుండి నాన
చెట్టు చేమ స్నానం
ఆకు అలమా గానం"-
నిజమే కదా. పై నుండి వాన పడుతుంది ‌. కింద ఆ వర్షం వలన నేల నానుతోంది. చెట్టు చేమ ఆ వాన చినుకులతో తడిచి స్నానం చేస్తాయి. వాన చినుకులు ఆకుల మీద పడుతూ ఉంటే 'టపటప'మని శబ్దం వస్తుంటే అవి పాడుతున్నట్లే గోచరిస్తుంది.
కొన్ని పాటలు భలే నవ్వులు కురిపిస్తాయి.మొదట గొప్పతనం చెప్పినట్లే చెప్పి తరువాత గాలి తీసినంత పని చేసి నవ్విస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ "అనగనగా రాజు"..
"అనగనగా రాజు
కొడతాడు పెద్ద ఫోజు
మూరెడు మూరెడు మీసాలు
బారెడు బారెడు గడ్డాలు
గుర్రాల మీద సవారి
పులిని చూస్తే ఫరారీ"-
నవ్వుకోడానికి పసందైన బుజ్జి పాట ఇది. ఇట్లాంటివి మన బడి పిల్లల నోట్లో కోకొల్లలు.
"నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు" అన్నట్లు సాగుతోందీ "నాగలి..అరక" పాట,
"భూమిని దున్నే బురుక
ఎద్దులు లాగితే ఉరుక
దున్నలు లాగితే బరుక
దున్నిన వానికే ఎరుక
దున్నని వారికి ఏమెరుకా?"
అంటూ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇందులో రైతన్న కష్టం ,దానికి పశువుల తోడ్పాటు గురించి ఒకింత అస్త్ర ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఆనందం కోసమే కాదు ఆలోచించాల్సిన బుజ్జిపాట కూడా.
"నేను పోత ఢిల్లీ"లో-
"కొణిదెస
  కొణిజెర్ల
 కొణిజేడు
 కొడిగెనవాల్లి
ఆపు.. ఆపురా.. నీ లొల్లి
నే.. వెళుతున్నారా.. ఢిల్లీ
నే వచ్చానంటే
చేస్తాను రా నీ పెళ్లి"-
అని పాడుకుంటూ ఉంటే పిల్లలు గొడవలు పెట్టుకుని "నీ పెళ్ళికి డొక్కు లారీ" అనుకున్నట్లు నవ్వొస్తుంది.

"చెక్కెరకేళి" లో
పండుగ హోళీ
తినేది గోళీ
కొట్టేది డోలీ
నమ్లేది పోలి
రాకండి నా జోలి"-అంటూ కొంటెగా బుడుగులు
కుదిరి కుదరక చూపుడు వేలుతో ముందుకి వెనక్కి అంటూ ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నట్లు ఉంది కదూ.
ఇట్లాంటి పాటలు ఎన్నో మనకి ఉయ్యాల జంపాల పుస్తకాలు పొందుపరిచారు రచయిత.
పిల్లలూ! మనం ఈ పుస్తకాన్ని చదివి అటు హాస్యాన్ని, ఇటు ఆలోచనాశక్తిని పెంచుకుని కల్మషం లేని మనుషులుగా, సమాజంపై అవ్యాజమైన ప్రేమను ఒలికిస్తూ అందమైన ప్రపంచాన్ని సృజించు కుందాం. ఏమంటారు బుడుగు లారా! అల్లరి పాపల్లారా!" పండే"నా?.

🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
క్రింది లింక్లో పుస్తక సమీక్ష చదవొచ్చు 👇👇👇👇
https://molakanews.page/qsZH84.html

13, జులై 2020, సోమవారం

నా సాహిత్య గురువులు శ్రీ పోతగాని సత్యనారాయణ గారి సంపాదకత్వంలో వెలువడిన పూల గోపురం పుస్తకంపై సమీక్ష 🌺🌺📗📗🧾🧾📚📚

పుస్తక సమీక్ష -2:- వర్తమాన సమాజ దర్పణం- పూల గోపురం
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా

       పూల గోపురం
"ఉత్తేజాన్ని కలిగించేది, ఉన్నత విలువలు నేర్పించేది, ఊహాశక్తికి పదును పెట్టేది ఉత్తమమైన పుస్తకం"- 
ఈ సూక్తి నూటికి నూరుపాళ్ళు ఈ "పూల గోపురం బాలల కథా సంకలనానికి" సరితూగుతుంది. బాలసాహిత్య రంగంలో పూలగోపురం ఒక మహత్తరమైన బాలల కథా కదంబం.

సాహిత్యంలో కథలు రెండు రకాలు. ఒకటి కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు,రెండోది ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చెప్పుకునేవి లేదా రచించేవి. ఈ సంకలనం లోని కథలు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసినవి. అంటే రెండో కోవకు చెందినవన్న మాట.
      సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నైతిక విలువలేలక్ష్యంగా పెట్టుకొని, చిట్టి చేతులతో కలాలు పట్టుకొని వర్తమాన సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలను, మనుషుల తీరును, నడవడికను, తొలి ప్రయత్నంలోనే చేయి తిరిగిన రచయితల్లా కథలు రాసి సమాజ హితానికి శ్రీకారం చుట్టారు. Vvr Zpss భీమవరం వర్ధమాన (బాల) రచయిత(త్రు)లు. 
ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిట్టి కథను చెప్పాలి.
"ఒకానొక కాలంలో "పోతగాని" అనే దివ్యమైన మహర్షికి కొంత మంది బాల శిష్యులు ఉన్నారు. శిష్యుల వయస్సు సుమారు 14 - 15 దాకా ఉంటాయి. వాళ్లు పరమానందయ్య శిష్యుల్లా కాదు, అపర మేధావులు. ఎటువంటి అంశానికైనా ఇట్టే స్పందించగలరు. చక్కని హితబోధలు, కథలు, ప్రవచనాలు, వ్యక్తిత్వ వికాసం గురించి బోధిస్తూ కలుషితం లేని ఆ విద్యార్థుల మదిలో జ్ఞాన,సంస్కార జ్యోతులను వెలిగించారు పోతగాని మహర్షి.
ఒకసారి ఈ ప్రపంచానికి ఆపద వచ్చింది. అది కేవలం మనుషుల్లో వస్తున్న మార్పుకి, సంభవిస్తున్న దురాలోచనలకి, దుర్బుద్ధికి, దురలవాట్లకు, అవి దారితీస్తున్న పరిణామాలకు ప్రపంచంలో "మంచితనం" అన్నది కనుమరుగై పోయిది. ఈ విషయం తెలుసుకున్న పోతగాని మహర్షి మనుషుల్లో మాయమవుతున్న మానవత్వానికి, వారిలో సంభవిస్తున్న దుష్టయోచనలకి ఏదైనా చక్కటి ఔషధం (మందు, విరుగుడు) తయారు చేయాలి అనుకున్నాడు. మనిషి మస్తిష్కం లో మానవత్వాన్ని మళ్ళీ చిగురింపజేయాలని అనుకున్నాడు.
అటు పిమ్మట తన శిష్యులకి ఈ ప్రళయం గురించి చెప్పి సమాజానికి ఉపయోగపడే ఔషధానికి తగిన మూలికలు వెదికి తీసుకురమ్మన్నాడు.
వెనువెంటనే శిష్యులందరూ తలొక దిక్కుకి వెళ్లి, కొన్ని రోజులు తర్వాత తిరిగి వచ్చారు. మూలికల్ని చేత పట్టుకొని. వాటిలో మేలైన మూలికలు ఏరారు పోతగాని మహర్షి. అందులో 15 మంది శిష్యులు తలా ఒక మూలికని తీసుకొస్తే, ఒక శిష్యురాలు మాత్రం రెండు సమాజహిత మూలికల్ని గురువుగారికి అందించింది.
ఇక ఆలస్యం చేయని పొతగాని మహర్షి, సంకల్ప బలం చేత తన శిష్యులు తెచ్చిన మేలైన 'సంజీవని' వంటి మూలికలతో కొంతమంది మునులు, మహర్షులుతో కలిసి ఒక యజ్ఞంలా, మనిషిలో దాగున్న కుబుద్ధుని మటుమాయం చేసి, మానవత్వాన్ని పరిమళింప చేసే "పూల గోపురం" అనే దివ్యౌషధాన్ని తయారు చేశారు.
తరువాత పూల గోపురం ఔషధాన్ని సేవించిన ప్రతి ఒక్క మనిషి, తన మస్తిష్కంలోని మలినాన్ని వదులుకొని, జ్ఞాన బోధ జరిగి, హితాన్ని తెలుసుకొని మళ్లీ మనిషిలా రూపుదిద్దుకున్నాడు.
___________
ఈ కథ నూటికి నూరు శాతం హిందీ ఉపాధ్యాయులు, పూల గోపురం బాలల కథా సంకలనం సంపాదకులు, శ్రీ పోతగాని కవి గారి కృషికి, వారికి తోడ్పడిన శిష్యులకి సరిగ్గా సరిపోలుతుంది.
సాధారణంగా పిల్లల కథల్ని పిల్లల కోసం పెద్దలు రాస్తుంటారు. కానీ ఇప్పుడు, కొన్ని దశాబ్దాల నుండి పిల్లల కోసం పిల్లలే రచనలు చేస్తూ "ఆహ్లాదకరమైన,అందమైన,కపటం లేని, కల్మషం లేని పిల్లల లోకాన్ని సృజించుకుంటున్నారు".వారికి తోడ్పాటుగా వెన్నుగా,దన్నుగా పోతగాని కవి గారి వంటి ఎందరో ఉపాధ్యాయులు సహకారంగా నిలుస్తున్నారు. వారిలోని కవిని,రచయితని వెలికి తీస్తున్నారు.
కథా రచన గురించి యువ రచయిత,కవి రాచమళ్ళ ఉపేందర్ గారు తొలిపాదులు పుస్తకంలో ముందుమాటగా ఇలా అంటారు-
"కథా రచన అనేది ఒక సృజనాత్మక కళ.కథ రక్తి కట్టాలంటే సమర్థవంతమైన ప్రతిభ,పాటువాలే కాదు నిరంతరం కృషి ఓపిక ఎంతో అవసరం.
కదిలే కాళ్లను,అల్లరి చేసి పిల్లలను కట్టిపడేస్తుంది మంచి కథ అంటారు.
మరి పిల్లల కథలు రాస్తే. చేయి తిరిగిన రచయితల్లా కథలు అల్లితే. అలా అల్లిన కథలకు పాఠకులకు కళ్ళు చెమ్మగిల్లితే, హృదయాలని పిండేస్తే.. దానికి మించిన సామాజిక ప్రయోజనం ఏముంటుంది? పిల్లల కృషికి అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది?" అంటారు.
పై మాటలు అన్నీ పూల గోపురంలో కథలు రాసిన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఎటువంటి సందేహం లేకుండా చెల్లుబాటు అవుతాయి.
ఇప్పుడు వస్తున్న కథల పుస్తకాలలో కల్పితాలకు చోటు ఎక్కువ. మానవతా విలువలు, సమాజ పోకడ కలిగిన బాలల కథలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహించిన పోతగాని కవిగారు వర్తమాన సమాజాన్నే కథలుగా మలిచేలా విద్యార్థుల చేత ఈ కథల సంకలనాన్ని రాయించారని భావించవచ్చు.
ఈ కథల పుస్తకంలోని కథలన్నీ విశిష్టమైనవి, విలువైనవి.
ముందుగా కథల సంకలనం ముఖచిత్రం మనల్ని ఆకట్టుకుంటుంది. పేరు కూడా సరికొత్తగా ఉంది "పూల గోపురం" అని.
కథలకు తగిన రీతిలో ఈ పిల్లలు రాసిన కధల శీర్షికలు ప్రతి పాఠకున్ని ఆకట్టుకుని, వేటికవే పోటీ పడుతుంటాయి.
పిల్లలందరూ గ్రామీణ జీవనం నుండి వచ్చారు కాబట్టి కథలన్నీ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి అద్దం పడుతూ ఎక్కడా విసుగును కలిగించకుండా హాయిగా సాగుతుంటాయి.
మొదటి కథ "భయం కాటు" ఎస్.నిహారిక రాసిన
కథ ఎదుటివారి సొత్తును దొంగతనం చేస్తే మనకు తెలియకుండా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా వెల్లడించింది.
"చదువు విలువ"కథలో సాయి రాం ఎంతో పరిణితితో ప్రస్తుతం చాలామంది జీవితాల్లో జరిగే సంఘటనలే ఉదాహరణగా తీసుకొని చక్కని కథని అల్లాడు. కార్తీక్ చదువుకోకుండా బలాదూర్ తిరుగుతూ తల్లిదండ్రుల కష్టం తెలియకుండా ఉండడం, ఒకసారి తల్లిదండ్రులు ఎలా పని చేస్తున్నారోనని తెలుసుకోవడానికి పొలానికి వెళ్లి వాళ్ళు ఎండలో కష్టపడి పని చేయడాన్ని చూసి పశ్చాత్తాప్పడి చదువుపై శ్రద్ధ చూపడం ప్రతి పాఠకున్ని ఆకట్టుకుంటుంది.
(13.07.2020..
మిగతా తరువాయి భాగంలో అనగా వచ్చే సోమవారం ప్రచురణ)

కె. పావని రాసిన"చెలిమి చెరిచిన చరవాణి"కథలో వర్తమాన సమాజంపై సెల్ ఫోన్ పిచ్చి పిల్లల్లో ప్రేమానురాగాలను ఎలా దూరం చేస్తుందో తెలియపరచింది.తరువాత నాయనమ్మ యుక్తితో చేసిన పని వల్ల సెల్ ఫోన్ భూతం వీడి మళ్ళీ మిత్రుడు తో స్నేహం చేయడం తో మంచి ముగింపు నిచ్చింది.

ఎస్. అఖిల్ కుమార్ రెడ్డి రాసిన"పిల్లి సాక్ష్యం"కథ చదువుతూ ఉంటే అచ్చంగా చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో కథలు చదివినంత ఆనందం కలిగింది.
ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో రాసిన కథ ఇది.
జి. అఖిల తన"వలపోత"కథలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కన్నులు చెమ్మగిల్లేలా రాసింది. కథా ఇతివృత్తం నవ సమాజానికి అద్దం పట్టింది.

బి.నితిన్ "పిట్టల శాపం"కథలో చెట్లను నరికి పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాకుండా, పక్షులు, జంతువులు నివాసాలు కోల్పోవడం వల్ల పిట్టలు మనుషులపై ఆగ్రహించి శపించడం అనేది ఆలోచించాల్సిన అంశం. నీటి ప్రాముఖ్యతను తెలియపరిచిన కథ ఇది.

"ముగ్గురు మిత్రులు" కథలో కె.ఉమ
     "మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది కైనా స్నేహాన్ని పంచగలరు" అనే ఒక్క మాటను ఆధారం చేసుకొని కథను నడిపించింది.
మనుషుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని, నిజమైన నిస్వార్ధమైన మిత్రులు చెప్పుడు మాటలకు తొందర పడరని మృదువుగా చెప్పి కథని ముగించింది.

"పాల పంచాయతీ" కథలో ఎన్. రక్షణ-
"కన్న తల్లి కి ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది"అనే సూక్తిని తీసుకొని యుక్తితో మన ఇంట్లో నిత్యం జరిగే అక్కాచెల్లెళ్ళు,అన్నాతమ్ముళ్లు,తోబుట్టువుల గొడవల్ని కథలా మలిచింది.
"కనులు చూసిన వెంటనే, బుద్ధికి పని చెప్పకుండా అనుమానాన్ని,తీర్చుకోకుండా అసూయతో రగిలి పోకూడదు" అంటూ 'అనుమానం పెను భూతం' అని చక్కని హితబోధ చేసింది.

కథా శీర్షికలోనే "తాగుడు వ్యసనం"అంటూ హెచ్చరిస్తున్న నఫ్రీన్ సమాజంలో నిత్యం జరిగే సంఘటననే కథావస్తువుగా తీసుకుని ఇంటి పెద్ద తాగడానికి అలవాటుపడి కుటుంబాన్ని ఒంటరిగా ఎలా రోడ్డుమీద వదిలేస్తుంటాడో దృశ్యమానం చేసింది.
"సంకల్పబలం"కథలో నందిని-
నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే ఆడపిల్ల పడే అవస్థని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఇది వర్తమాన అంశం. సంఘంలో అనుదినం చోటుచేసుకునేది.
ఈ కథలో శ్రావణి లాగే తల్లిదండ్రుల్ని కోల్పోయి సంకల్ప బలం చేత చక్కగా చదువుకొని విజ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఆడపిల్లలు కోకొల్లలు. 
తల్లి తండ్రులు చనిపోతే ఆడపిల్ల నిస్సహాయంగా ఉంటుందని, చుట్టాలు ఎవరూ పట్టించుకోరని,అదే మగవాడైతే ఎవరైనా ముందుకు వచ్చి పెంచుకుంటారని నేటికీ కొనసాగుతున్న ఆడ మగ వివక్షని కళ్ళు చెమ్మగిల్లేలా కథలో చొప్పించింది.

        "ఆస్తులు-ఆత్మీయతలు"కథను రాసిన ఎం. సరస్వతిని అభినందించకుండా ఉండలేం.
ఈ కథను చదువుతున్నంతసేపు మనసుకు ఉల్లాసంగా,ఆలోచించే విధంగా ఉంటుంది.ఈ కథ చదువుతుంటే వారికి ఈ సమాజం పైన ఆత్మీయతలకు, డబ్బుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతగా అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది.ఈ కథను చదువుతూంటే ఒకప్పటి పాత సినిమాల్లోకి వెళ్ళిపోతాం. మానవ జీవితంలో ఆస్తులకు విలువ ఇస్తే ఎలా ఉంటామో, ఆత్మీయులకు విలువ ఇస్తే ఎలా బ్రతుకుతామో ప్రత్యక్షంగా చూపించే కథ.

         తొమ్మిదవ తరగతి చదివే బాలస్వామి "చదివే హక్కు" అంటూ ఒక నినాదాన్ని పలికినట్లు కథను రాశాడు.
ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తూ,ప్రస్తుతం సంఘాల్లో పేదల పిల్లలు చదువుకోకుండా పనులు చేస్తూ ఉండడాన్ని చూపించాడు సూక్ష్మంగా.
కథలు రాయడం అంటే కేవలం కథ చెప్పడం కాదని, కథా రచయిత కథలోని పాత్రలతో మాట్లాడించాలని తన పదునైన పద, భావజాలంతో వ్యక్తపరిచాడు.
చివరిగా "దాన ఫలం" కథలో నాజియా బేగం "ఎదుటి వారి కష్టాలను ఎరిగి సాయపడితే మనం సాయం పొందుతామని" హితవు పలికింది.
పాఠశాలలో చదువుకునే దశలోనే ఇంతటి సమాజ అవగాహన, ప్రేమానురాగాలు, పదునైన భావజాలం కలిగిన (కలగలిసిన) ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భవిష్యత్తులో గొప్ప మానవతా విలువలు తెలిసిన రచయిత(త్రు)లు కాగలరని ఆశిస్తున్నాను.
పిల్లలకి ఇంతటి మహత్తరమైన జ్ఞానం, ప్రేమ, సద్గుణాలను తెలియపరిచి సమాజానికి "నైతిక విలువల టానిక్"ని అందించిన శ్రీ పోతగాని కవి గారిని అభినందించకుండా ఉండలేం.
ఇలాగే ప్రతి ఒక్క పాఠశాలలో పిల్లలు ,ఉపాధ్యాయులు నవ సమాజం కోసం పూలగోపురంతో ముందడుగు వేసిన భీమవరం పిల్లల్లా కృషి చేసి ఈ సమాజానికి మహోన్నత రచనలు అందిస్తే రేపు ఈ సమాజంలో మన చూపులు చాలా శుభ్రంగా ఉంటాయి.
ఇది కేవలం బాలసాహిత్యాన్ని, తెలుగు భాషని కాపాడుకుంటే జరిగే మార్పు.అందుకే తెలుగు భాషని, బాలసాహిత్యాన్ని కాపాడుకుందాం పరిశుభ్రమైన నవ సమాజాన్ని తరిద్దాం, సృష్టిద్దాం.

||జై బాలసాహిత్యం|| ||జై జై వర్ధమాన(బాల) సాహిత్యకారులు||
📚📚📚📚📚📚📚📚
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...