14, నవంబర్ 2020, శనివారం

తరణం జాతీయ దినపత్రిక నిర్వహించిన "బాలలు భావి భారత పౌరులు" అనే అంశంపై నేను పంపిన సమ్మోహనాల లఘు కవితలు

 


తరణం జాతీయ దినపత్రిక


బాలల దినోత్సవం సందర్భంగా


బాలలు భావి భారత పౌరులు


           బాలలు సమ్మోహనాలు


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు కుమారా/!

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా/!

గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా/!

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలోలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/!

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును కుమారా/!

*లిఖిత్ కుమార్ గోదా*, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్, ఖమ్మం.
ఫోన్:- 9949618101.



10, నవంబర్ 2020, మంగళవారం

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"






బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.


కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.


రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.


  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు

బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.

      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.


బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.

ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.


ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.


"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.

తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.


మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.

"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.


ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.

రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.


ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.


నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!

"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.

ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.

 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.
ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.

"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.
"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.
"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.

పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.
"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.

శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.

పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.
"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.

"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.
ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.

తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 

            ✍️  పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

9, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ సాహితీవేత్త గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు"(పుస్తక సమీక్ష-06)

మొలక న్యూస్ లో ప్రచురించిన నా పుస్తక సమీక్ష (09/11/2020)


పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు కవర్ పేజి




ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.


అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.


ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.


బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.


ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.


మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.


"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.


"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.


"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.


ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!

సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.htm





సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.html




📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒

2, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ బాల సాహితీవేత్త గుడిపూడి రాధికా రాణి గారి పుస్తకం బాల కథంబం పై నేను సూర్య దినపత్రికలో రాసిన పుస్తక సమీక్ష (05)

 నైతికాల మకరందం.. రాధికా రాణి గారి బాల కథంబం (పుస్తక సమీక్ష)

బాల కథంబం పుస్తకం కవర్ పేజి



రచయిత్రి:- గుడిపూడి రాధికా రాణి గారు

నా పుస్తక సమీక్ష-5






సూర్య దినపత్రిక అక్షరం డెస్క్

పసిపిల్లలకు ఈ ప్రపంచంలో విలువైనవి, విశిష్టమైనవి, ఇష్టమైన సంపదలు ఏమన్నా ఉన్నాయీ అంటే అవి ఆలోచనా శక్తికి పదునుపెట్టి, మనసులో మంచి చెడుకు వ్యత్యాసం వివరించి, సద్గుణాల సమేతంగా సత్బాట వైపు నడిపించే బాలల కథలే అని కచ్చితంగా చెప్పాలి.

పిల్లల మనసులు ఐస్కాంతల్లాంటివి. వాటికి నైతికాలను నూరిపోసి, మెదడుకు పని చెప్పే కథలు కనిపిస్తే చటుక్కున అతుక్కు పోతాయి. చక్కగా ఇంట్లో అమ్మో, తాతయ్య నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, పాఠశాలలో ఉపాధ్యాయులో తేనెలొలుకు కథలు చెబుతూ ఉంటే అల్లరి బుడుగులు సైతం గప్చుప్ న కూర్చొని వారు చెప్పే కథల్లో విహరిస్తారు. కథల ఒడిలో వాలిపోతారు. కథల్లో వారికి వచ్చే సందేహాలను, బయట అంతుపట్టని విషయాలను కూడా త్వరగా నివృత్తి చేసుకోగలుగుతారు. అలా వారి మనసు, ఆలోచనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఇంధనం.. మేలైన బాలల కథలే కదా!.

అలాంటి మానవీయ, స్ఫూర్తి నీయమైన, ఆలోచనాత్మక, సృజనాత్మక కథలకు నిలయమే గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం బాలల కరదీపిక.
రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారు ప్రముఖ సాహితీవేత్త. బాలల కథలు, పజిల్స్ ,గజల్స్, కవిత్వాలు రాయడంలో, నిత్య నూతనంగా ఆవిర్భవిస్తున్న నూతన కవితా ప్రక్రియల్లో కలం పట్టడంలో వారిది అందెవేసిన చేయి. రాసిన ప్రతి వాక్యం నలుపాకమే అని చెప్పాలి. భాషా క్రీడాకారిణిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు. మేలైన బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం అందించడంలో సిద్ధహస్తులు.

ఈ పుస్తకంలోని కథలు ఒక్కసారి చదివామంటే చాలు. అల్లరి చేసే గడుగ్గాయులు కూడా సద్గుణులు అవుతారు. ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో వేటికి విలువ ఇచ్చి జీవించాలో, వేటికి ఇవ్వకూడదో కూడా ఇట్టే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.
పెద్దలు సైతం ఈ కథల్ని పాయసంలా స్వీకరించి,వారి ముందు జీవితంలో ఎటువంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి మేలైన మహత్తర సందేశం కలిగిన కథలివి.
పదేపదే విసుగు లేకుండా చదివించే కథలు. వీటికి అవార్డులతో తూకం వేస్తే అది పొరపాటే అని చెప్పాలి.
ఈ కరదీపిక లో మనల్ని తొలకరిగా పలకరించే "జేబులో జోరీగ" కథ నుండి "ఇరుకిల్లు" కథ వరకు, అన్ని మనల్ని పుష్పక విమానం లో కూర్చోబెట్టుకుని చక్కగా విహరింప చేస్తాయి."మనిషి కావాలి మనిషి"అన్నట్టు,"మనిషి లక్ష్యం మనీషి" అన్న సూక్తే లక్ష్యంగా ఇవి మనల్ని తీర్చిదిద్దుతాయి. నవ్విస్తాయి, నేర్పిస్తాయి ఈ కథలు.
 "జేబులో జోరీగ"కథలో రాఘవయ్య అనే పిసినారికి ఐదు రూపాయల నాణెం దొరకడం, అది మాట్లాడుతూ, రాఘవయ్యని ముప్పుతిప్పలు పెట్టడం, ఎంత దూరం విసిరేసిన తిరిగి తన జేబులోకి రావడం, చివరి ప్రయత్నంలో బిచ్చమెత్తుకునే ముసలమ్మకు ఐదు రూపాయల నాణెం దానం చేయగా, ఆ నాణెం ఏం మాట్లాడకపోవటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ ముగింపులో,"ఆకలి వేయకపోయినా స్వార్థంతో తను కొనుక్కుందాం అనుకుంటే, వారించి, వాదించి, వేధించిన ఆ డబ్బే, ఆకలి తో బాధపడుతున్న వ్యక్తికి దానం చేయగానే శాంతించింది"అన్న ముగింపుతో గొప్ప అర్థాన్ని ఇచ్చి చాలా సృజనాత్మకంగా రచించారు రచయిత్రి  "చంద్రుడి కోపం, సూర్యుని తాపం" కథలు మనకెందుకు నెలరోజుల్లో నాలుగు సెలవులు (4 ఆదివారాలు), చంద్రుడు ఎందుకు ఒక రోజు సెలవు (అమావాస్య) తీసుకుంటాడో చాలా చక్కగా వర్ణించారు.
అలాగే ఒకప్పుడు చేదుగా చెరుకు, తీపిక కాకర ఉండి ఇప్పుడెందుకు చెరుకు తియ్యగా, కాకర చేదుగా ఉందో , ఒకప్పుడు పాముకి కాళ్లు ఉండి, ఇప్పుడు ఎందుకు పాకుతుందో జానపద కథలు లాగా కల్పితాత్మకంగా సృజించారు రచయిత్రి.

"పంచదార పిల్లి" కథలో, మంచితనానికి, దొంగతనానికి సమాజం స్పందించే తీరు"ఎలా ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించిన కథ అందర్నీ ఆకట్టుకుంటుంది.

"కుదురు లేని కుంకుడు గింజ" కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి."కుదురుగా ఉంటే అందరూ ఇష్టపడతారు" అన్న నేపథ్యంతో కుంకుడు గింజకి , చింతగింజకి మధ్య జరిగిన కథ. మన పరిసరాల్లో నుంచే కథా వస్తువులు తీసుకుని కథలుగా లిఖించడం రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారి సృజనాత్మకతకు అద్దం పడుతుంది.

ఇందులో చెప్పుకోవాల్సిన కథ "కుండ కోరిక "కూడా. ఇది వాట్సాప్ లో రెండురాష్ట్రాలు చుట్టివచ్చిన రైలు లాంటిది. గొప్ప నీతి ఉన్న జీవితానికి సంబంధించిన కథ. కష్టాల కడలిని దాటుకుంటే పొందే సుఖాన్ని, భయపడితే పొందే శోకాన్ని చక్కగా వివరించిన కథ.
"పిసినారి బావ, కోడలు దానగుణం, "పిండి వంటల రహస్యం" కథలు ముందుచూపు నేర్పించే నిండైన బాలల కథలు.
"ఇరుకిల్లు" మధ్య బంధాలు ఎలా కొలువై ఉంటాయో, భవనాల్లో మానవీయ బంధాలు ఎలా దాక్కుంటాయో" వివరించిన వర్తమాన సమాజపు కథ.
ఈ ఇరవై రెండు కథల్లో కథలో భాగంగానే ముగింపులు నీతిని వివరించారు రచయిత్రి.
ఇలా ఎన్నో ఆసక్తికర శీర్షికలతో,నైతికాల కథలతో ముస్తాబైన ఈ బాల కథంబం కరదీపిక పిల్లల పాలిట ఓ గురువు, ఆస్వాదిస్తే మకరందం, పెద్దల పాలిట మార్గ నిర్దేశం, వర్ధమాన రచయితల పాలిట కామధేనువు, దిక్సూచి.ఇలాంటి కథలు మొత్తం పిల్లలు అందరూ చదివి ఆస్వాదించాలని ఆకాంక్షించాలి ప్రతి తల్లిదండ్రులు. రేపటి భావి భారత పౌరులు ఉత్తమంగా తయారు కావాలంటే చిన్నతనం నుండే ఈ "బాల కథంబం" వంటి కథలు చదవాలి. మనిషి నుండి మహర్షిగా జీవించాలి. బాలసాహిత్యంలో ఇటువంటి మనోరంజక కథల పొత్తాన్ని వెలువరించిన రాధికా రాణి గారికి అభినందనలు.

*పుస్తక సమీక్షకుడు*- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
📗📘📙📗📘📙📗📘📙📗📘📙
నవంబర్ 2,2020

30, అక్టోబర్ 2020, శుక్రవారం

కైతికాలు: మొలక న్యూస్ లో ప్రచురణ (29/10/2020)

కైతికాలు


పుస్తకాన్ని ప్రమిదలా
మార్చుకున్న రోజు,
జీవితమున నువ్వు
విజేతవైన రోజు
వినవయ్యా విద్యార్థి
అన్యాయానికి ప్రత్యర్థి!

గురువు మాటలు వినాలి
మంచిని చెప్తారు కనుక,
విని వదిలేస్తే సరిపోదు,
పాటిస్తే అది కానుక,
వినవయ్యా విద్యార్థి
భావి తరపు ఆదిత్యా!!

సన్మానాలాశించక 
కవిత్వాన్ని రాసుకో
శాలువాలు కోరె బుద్ధి
మనసు నుంచి వదులుకో
వినవయ్యా కవివర్యా,
మార్చుకో కవన చర్య!!

జగతిలో వ్యాప్తించెద
కవన మొక్కలు నాటి,
పాఠకునెదలో నిలిచెద
శోక సంద్రాలు దాటి.
కవి రాసే సత్యాలు
ఆదిత్యుని కిరణాలు!!

లిఖిత్ కుమార్ గోదా.,
కలం పేరు:- ఆదిత్య శ్రీ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

లింక్ ఇది 🖊️🖊️
కైతికాలు: -లిఖిత్ కుమార్ గోదా.,( ఆదిత్య శ్రీ)ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/sXGtss.html 

సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియలో పోటీ..

 సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్(కవితాలయం) లో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియ కవిత పోటీలో తొలి ప్రయత్నంగా పాల్గొన్నందుకు వారిలో నేను కూడా ఒక విజేతను అయ్యినందుకు సంతోషంగా ఉంది ❤️❤️

ఆత్మీయులు సాయి రమణి అక్కకి ధన్యవాదాలు 🙏🙏
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
పదబాణీ-2
శీర్షిక:- చినుకు సంబరం

నలుపు
నైలాలు
నైనాలు
నవ్వులు
నారీల
నాట్యాలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం..
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.
ఫోన్:-9949618101

12.10.20202)

పదబాణీ-2

శీర్షిక:- మద్యపు మత్తు..
🌱🌱🌱🌱🌱
మహిలో
మనిషి
మారడా
మద్యపు
మత్తులో
మునిగి!
🌿🌿🌿🌿🌿🌿
✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202
ఫోన్:- 9949618101
🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️
#బాటసారులకు నమస్కారం 🙏.

#పదబాణీ -1వ కవితాపోటీని విజయవంతం చేసిన ప్రతి బాటసారికీ ప్రత్యేకంగా ధన్యవాదములు🌹🎉.

#నూతన విధానమైననూ మీరందించిన ప్రోత్సాహం, కార్యక్రమాన్ని నడపడానికి కావాల్సిన అభిమానం అందజేసిందనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. 
ఈ ప్రయత్నాన్ని ఇలాగే విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. 
ఇక 
#విభిన్న కోణాలలో మీరందించిన
#పదబాణీలలో 
#మాకు ఉన్న పరిమిత పరిజ్ఞానంతో క్రింద కనబరిచిన పదబాణీలను #విజేతలను ఎన్నుకోవటం జరిగింది 
నిజం చెప్పాలి అంటే అందరూ అద్భుతంగా రాసారు 
విజేతలను ఎన్నుకోవాలి కాబట్టి ప్రకటిస్తున్నాము .
చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల #కొద్దిమంది విజేతలుగా నిలవలేకపోయారు. 
ఇక విజేతల వివరాలకు వస్తే 
#పదబాణీల విజేతలు.. 
పదబాణి -2విజేతలు
1.NRK. రాజు గారు 
2.సంతోషి సన్నిధి గారు 
3.జానపాటి. మహాలక్ష్మి గారు 
4.లక్ష్మీ సుధా దేవి గారు 
5.లిఖిత్ కుమార్ గోదా గారు 
6.లిలిత చిట్టే గారు 
7.డాక్టర్ అహల్య మరుదాడు గారు 
8.జ్యోతి మువ్వల గారు 
 9.శ్రీ సూర్య గారు 
10.శ్రీతరం బింగి శ్రీకాంత్ గారు 
#అందరికి విజయ శుభాభినందనలు
#సమీక్షలు...
#NRK. రాజు గారు 
కష్టాలు కన్నీళ్లు కొన్నాల్లె అంటూనే కడలి కన్నీళ్లు కాస్సెపే అంటూ చెప్పె విధానము అద్భుతంగా ఉందండి. అభినందనలు
#సంతోషి సన్నిధి గారు 
నిశిలోను, నీడలోను నడక లోను తోడు ఉండే నా నవ్వు అని సుందర భావనలతో అద్భుతంగా వర్ణించే భావన బాగుందండి.అభినందనలు 
#జనపాటి. మహాలక్ష్మి గారు 
మగువ మనస్సు మేలైన మమత మాణిక్యం అంటూ మగువ మనస్సును మాణిక్యంతో పోల్చటం బాగుందండి. అభినందనలు 
#లక్ష్మి సుధా దేవి గారు 
కమ్మని కలలు కవ్విoచే కోమలి కన్నుల్లో అంటూ కలలను కమ్మదనంతో పోలుస్తూనే కోమలి కన్నులును జత చేయడం బాగుందండి.అభినందనలు 
#లిఖిత్ కుమార్ గోదా గారు 
మనిషి మద్యపు మత్తులో పడి మారడా అంటూ ప్రశ్నించే తత్త్వం బాగుంది చిన్న వయస్సులోనే మీరు సాహిత్యంపై అభిమానం చూపిస్తూ అద్భుతపదజాలం ఉపయోగించే తీరు బాగుందండి. అభినందనలు 
#లలిత చిట్టే గారు 
మది యొక్క మెత్తదనం చెబుతూనే మ్రోగింది మధుర మంజీరం అని చెప్పె విధానం బాగుందండి.అభినందనలు 
#డాక్టర్. అహల్యా మరుదాడు గారు 
సింధూరం, సౌశీల్యం సౌభాగ్యం సతికి ఉండాలి అని చెప్పటం బాగుందండి.అభినందనలు 
#జ్యోతి మువ్వల గారు 
మదిలో మగని మమత దాగుందని చెబుతూ మేడలో మాంగళ్య బంధం ఉందని చెప్పటం బాగుందండి.అభినందనలు 
#శ్రీ సూర్య గారు 
సృష్టిలో సహనం, సంస్కారంతో, సౌశీల్యంతో మెలగటం అసలైన సిరులు పంట అనటం బాగుందండి. అభినందనలు 
#శ్రీతరం బింగి శ్రీకాంత్ గారు 
కలువ కన్నులతో పోలుస్తూ కమనీయ దృశ్య కావ్యంతో చెప్పడం బాగుందండి. అభినందనలు 

మీ ఆత్మీయ సోదరి 
కుమారి చెన్నా. సాయిరమణి 
కవితాలయం 
ధన్యవాదములు 🙏🙏🙏

విజేతల ప్రకటన




దోహాలు

 ☝️☝️దోహాలు☝️☝️

రచన:- లిఖిత్ కుమార్ గోదా

#మీరు తెలుగు దోహాలు రాయాలనుకుంటున్నారా?అయితే ఈ క్రింది దోహాలను చదివి,నియమాలను తెలుసుకోండి...త్వరలోవెలువడనున్న 'తెలుగు దోహాలు' సంకలనానికి మీ దోహాలను సిద్ధం చేయండి..


||తెలుగు దోహాలు||

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

*

మమతపంచు 'సత్య'సూక్తే,తలచ మృధువైన ముంజ|

తాగుబోతు నోటిమాటే,బురదలొ పాతిన గుంజ||


*

గెలుపు లభించకుందంటే,'సత్యము' సాధన కొరత|

అంతర్బాహ్య శక్తులతో,పెనగకుంటె అస్థిరత||


*

దాపురించిన పరిస్థితే,సాహసాల జాబిల్లి|

'సత్య'!సందివ్వక కొడితే,తిరగబడునులే పిల్లి||


*

'సత్య'!ఆపత్కాలమునే,ఆలోచన లుదయించు|

దాలిన కాగని పాలలో,ఎట్లు వెన్న జనియించు||


*

తలచినకొద్ది 'సత్య'మిదే,మది కంపించే తీగ|

తోలినకొద్ది వాలునులే,'చింతే' తొలగని ఈగ||


*

'సత్య'!తృప్తినీని పనులే,వీడుట మేలగు రోసి|

కష్టము తప్ప నిష్ఫలమే,గుట్టకు కట్టెలు మోసి||


*

ఆశించక ఫలితాలనే,పనిచేయగ తలపెట్టు|

'సత్యము'చేయు సాధనయే,కీర్తి గుడికి తొలిమెట్టు||


÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷


#తెలుగుదోహా నియమాలు:

~~~~~~~~~~~~~~~

*దోహాలు రెండుపాదాలను కలిగి ఉంటాయి.ప్రతిపాదాన్ని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు..


*ప్రతిపాదం తొలి అర్థభాగం 13 మాత్రలు కలిగి,పదమూడవ మాత్రాక్షరం గురువు(దీర్ఘాక్షరం)అయ్యుండాలి.


*ప్రతిపాదం రెండవ అర్థభాగం 11మాత్రలు కలిగి,పదకొండవ మాత్రాక్షరం లఘువు(హ్రస్వాక్షరం)అయ్యుండాలి.


*ఏ పాదంలోని ఏ అర్థభాగమైనా ఐదు మాత్రలతోను,'జ'గణం(IUI)తోను మొదలు కాకూడదు.


*ప్రతిపాదం చివర అంత్యప్రాసను రూపొందించాలి


*తఖల్లుస్(నామముద్ర)ప్రయోగించవచ్చు


*దోహాలు ముక్తకాలు.దేనికదే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటుంది.


*దోహాలకు శీర్షిక ఉండదు.


@@@@@@@@@@@@


🌿విడువక చదివిన పొత్తమే, ఎదలో నిలుపును శాంతి|

పొత్తము విడిచిన చేరులే, మదిలో తెలియని భ్రాంతి||(01)


🌿 అధిరోహించిగ శిఖరమే,మనిషికి కీర్తి వచ్చును!

లిఖిత్ కూర్చోకు ఒట్టిగా, విప్పలేవుగ ఉచ్చును!!(02)


🌿ఘోర తపస్సు చేసిననూ,ఖలుడు వీడడు కుటిలము!

క్షీరము కలిసిన సలిలమును, విడదీయుటే జటిలము!!(03)


🌿శూలము పర దేహములకే, మిక్కిలి పెరిగిన గోరు!

శల్యమగును పరులెదలకే, "లిఖి"అదుపు లేని నోరు!!(04)


🌿వింటే సజ్జన పలుకులే,దరిచేరదుగా క్షోభ!

విని చూడు గురువు మాటలే,"లిఖిత్" జీవితమె శోభ!(05)


🌿ఖలుని ఎంతగ తిట్టిననూ,బాధ పెట్టవు చివాట్లు!

కొడితేనేమి శునకమునే, మార్చదు తన అలవాట్లు!(06)



🌿సన్మానాలనాశించే ,రాయకు లిఖిత్ కవితలు!

తెలుసుకుంటే సత్యములే,రాసినవగును తవికలు!!(07)


Trishul Samacharam daily Published

(27/10/2020)


✍️ లిఖిత్ కుమార్ గోదా.,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

15, అక్టోబర్ 2020, గురువారం

కైతికాలు నూతన కవితా ప్రక్రియ: గోస్కుల రమేష్ గారు

 కైతికాలు రాయడం సులభం ఇలా.....

==============
✍మాత్ర ఛందస్సులో రాయాలి
✍ 1,2,3,4,పాదాలలో 9 నుండి 12 మాత్రలు ఉండాలి
✍ 2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి
✍ 5 పాదంలో "వారెవ్వా" లేదా పై నాలుగు పాదాలను బలపరిచే మకుటం ,లేదా సరైన పదము గానీ వాడాలి
✍6 వ పాదంలో కవితాత్మక వాక్యం ,నూతన పదబంధం లేదా జాతీయం ,కొసమెరుపులా ఉండాలి 
✍5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు.కాని సరితూగే అక్షరాలు ఉండాలి.పెద్ద వాక్యాల రూపంలో ఉండకూడదు
====================
ఉదాహరణకు=
లఘవు=1,గురువు=2 మాత్రలు

1) పూ ల న్ని ప ర వ శిం చే
     2 2 1 1 1 1 2 2 =12 మాత్రలు
2) అం ద మై న పం డ గ
     2 1 2 1 2 1 1 =10
3) అ మ్మా యి లం ద రు
     2 2 1 2 1 1 =9
4) ఆ డి పా డు మెం డు గ
     2 1 2 1 2 1 1 =10

5) మా ఊరి బతుకమ్మ 

6) సిరి సంపదలివ్వమ్మ

==========
తీ రొ క్క పూ ల తో
2 2 1 2 1 2 =10

తీ ర్చి ది ద్దు వ ని త లు
2 1 2 1 1 1 1 1= 10

బ తు క మ్మ పా ట ల తో
1 1 2 1 2 1 1 2=11 

నా ట్య మా డు ప ల్లె లు
2 1 2 1 2 1 1= 10

మా ఊరి బతుకమ్మ 

చిరు నప్వుల పువ్వమ్మ
========
అ మ్మ లే ని ఇం టి లో
2 1 2 1 2 1 2 =11
అ ను రా గం మూ ల న
1 1 2 2 2 1 1==10
క న్న త ల్లి లే కుం టే 
2 1 2 1 2 2 2==12
జీ వి తం లో రో ద న
2 1 2 2 2 1 1 =11

కనిపించే దేవత

కన్నతల్లే ఇలలోన
=======
నా దే శం నీ దై న
2 2 2 2 2 1=11
నీ దే శం నా దై న
2 2 2 2 2 1=11
ఎ వ రై న నే ల పై నే
1 1 2 1 2 1 2 2=12
ఎం దు కు ఈ హై రా న
2 1 1 2 2 2 1=11

మారవోయి ఓ మనిషి 

ఉగ్రవాదాన్ని వదిలేసి

✍కోడెం సాంబయ్య (కోసా)
   పద్మాపురం.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️

            

కైతికాలు


*లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం*

అక్షరాన్ని నమ్ముకున్న
నిలుచును మన జీవితాలు
కవిత్వాన్ని నమ్ముకున్న
కలుగు నిత్య సత్యాలు
వారెవ్వా లిఖితాలు
శాంతి కోరు కపోతాలు!!(01)

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

మదిలో భావాలు కోసి
పూసగుచ్చె కైతికాలు,
మదిలో బాధలు మరిచి
నేర్చెద నైతికాలు
వారెవ్వా లిఖితాలు
మదిని దోచే కవిత్వాలు!(02)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వీచే గాలికి తెలుసు
మనిషి ప్రాణం విలువ,
పీల్చే మనిషికి తెలుసా
ప్రకృతి తల్లి విలువ
ఇకనైనా మానవా !
ప్రకృతిని భాధించుట!!(03)

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱


పిల్లల నవ్వులు కోరి
చందమామ స్థాపించెను,
కమ్మని కథలు చెప్పి
నీతి సారము పంచెను
వారెవ్వా చక్రపాణి
తెలుగు జనుల వాణి!!(04)

📖📖📖📖📖📖📖📖📖📖📖

పుస్తకాన్ని ప్రమిదలా
మార్చుకున్న రోజు,
జీవితమున నువ్వు
విజేతవైన రోజు
వినవయ్యా విద్యార్థి
అన్యాయానికి ప్రత్యర్థి!(05)

గురువు మాటలు వినాలి
మంచిని చెప్తారు కనుక,
విని వదిలేస్తే సరిపోదు,
పాటిస్తే అది కానుక,
వినవయ్యా విద్యార్థి
భావి తరపు ఆదిత్యా!!(06)
🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵
సన్మానాలాశించక 
కవిత్వాన్ని రాసుకో
శాలువాలు కోరె బుద్ధి
మనసు నుంచి వదులుకో
వినవయ్యా కవివర్యా,
మార్చుకో కవన చర్య!!(07)
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జగతిలో వ్యాప్తించెద
కవన మొక్కలు నాటి,
పాఠకునెదలో నిలిచెద
శోక సంద్రాలు దాటి.
కవి రాసే సత్యాలు
ఆదిత్యుని కిరణాలు!!(08)
❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️
అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)

కలాం అడుగు జాడలతో
రామేశ్వరము తరించె
పేపరేసి చదువుకుని
దేశాన్ని పాలించె
వారెవ్వా మౌనముని!
జగతి మెచ్చిన విజ్ఞాన గని!!(09)
🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️
చదువుకునెను ప్రీతితో
క్రమశిక్షణ సమేత
జగతి మెచ్చేలా అయ్యె
అంతరిక్ష శాస్త్రవేత్త
వారెవ్వా మిసైల్ మ్యాన్!
భారతీయ మహాన్!!(10)
🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కష్టాలు దాటుకుని
కలామయ్యెను విజేత,
పట్టుదలతో జీవితము
సాధించిన అధినేత
భారతరత్న కలాం!
భరతజాతికాదర్శం !!(11)
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
మహర్షిలా మౌనముగా
మాటల రాశులు పంచెను
అందరికీ హితుడై
జీవితాన్ని నేర్పెను
కలాం వాక్కు ముత్యాలు!
పాటించే సత్యాలు!!(12)
💧💧💧💧💧💧💧💧
లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
కలం పేరు:- ఆదిత్య శ్రీ
{ అబ్దుల్ కలాం ఆరాధ్య
 అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)-లిఖిత్ కుమార్ గోదా, (ఆదిత్య శ్రీ)ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం - MOLAKA - https://molakanews.page/C3rmy1.html]



✍️ *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.*
కలం పేరు:- శ్రీ ఆదిత్య

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...